టాస్క్‌ఫోర్స్‌ ఐజీ ఎదుట లొంగిపోయిన టీవీ ఆర్టిస్ట్‌ 

18 Jul, 2018 02:55 IST|Sakshi
టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయిన బుల్లితెర నటుడు శ్రీహరి

తిరుపతి సిటీ: ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన కేసుల్లో జబర్దస్త్‌ షోలో కమెడియన్‌గా నటించిన శ్రీహరి మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయాడు. తిరుపతికి చెందిన యల్లంపల్లి శ్రీహరి న్యాయవాదితో వచ్చి కపిలతీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో  లొంగిపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో వచ్చిన ఆదాయంతో సినిమా తీశాడని, టీవీ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ మధుబాబు తెలిపిన విషయం విదితమే.

ఈ నేపథ్యంలో శ్రీహరి కోసం 5 రోజులుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలింపు చేపట్టగా, ఐజీ ఎదుట లొంగిపోయాడు. పోలీసులు  శ్రీహరిని కోర్టులో హాజరుపరిచారు. ఇతనిపై 10కి పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, తన ఆర్థిక పరిస్థితి బాగోలేక తాను ఒకే ఒక్క సారి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పాల్గొన్నానని శ్రీహరి మీడియాకు తెలిపారు. ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తుండగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పట్టించానని, దాన్ని దృష్టిలో పెట్టుకుని కానిస్టేబుల్‌ తనపై అనేక కేసులు బనాయించి ఇరికించాడని చెప్పారు. 

మరిన్ని వార్తలు