ప్రముఖ టీవీ షో ప్రొడ్యూసర్‌కు ఏడేళ్ల జైలు

27 Jul, 2018 09:29 IST|Sakshi

సాక్షి, ముంబై:  జూనియర్‌ ఆర్టిస్టుపై అత్యాచారానికి పాల్పడిన  ఓ టీవీ ప్రొడ్యూసర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది.  31ఏళ్ల జూనియర్ నటిపై అత్యాచారం చేసిన ఆరోపణలను ధృవీకరించిన కోర్టు అతగాడికి ఏడేళ్ల కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.  ముంబై ప్రత్యేక మహిళా కోర్టు ఈ తీర్పును వెలువరించింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అశ్విన్‌ రాయకర్‌  అందించిన సమాచారాన్ని ఉటంకిస్తూ ఫ్రీ ప్రెస్‌ జనరల్‌   ఈ విషయాన్నిరిపోర్ట్‌ చేసింది.

ప్రముఖ  హిందీ టెలివిజన్ షో (ఏక్‌ వీర్‌ కి అరదాస్‌ వీర) ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ముకేష్‌ మిశ్రా  (33)  జూనియర్‌ ఆర్టిస్టుపై లైంగికి దాడికి పాల్పడ్డాడు.  పథక ప్రకారం బాధితురాలికి  ఫోన్‌ చేసి ఉదయమే షూటింగ్‌ రావాలంటూ ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు.  ఆమె  బస్‌స్టాప్‌కు చేరుకునే లోపే అక్కడకు చేరుకున్న ముకేష్‌,  బస‍్సు రావడం లేటవుతుందని చెప్పి,  షూటింగ్‌ లొకేషన్‌లో తాను డ్రాప్‌ చేస్తానంటూ  ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం మేకప్ రూమ్‌లో అత్యాచారానికి పాడ్పడ్డాడు. 2012, డిసెంబరులో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, బాధితురాలిని లైంగికంగా తనకు సహకరించాలంటూ బెదిరించడంతో పాటు, కూతుర్ని చంపేస్తానంటూ  బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భర్త సహాయంతో 2013 జనవరిలో  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ముకేష్‌ను  దోషిగా తేల్చింది.  నేరస్తుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది.  దీంతోపాటు  5వేల రూపాయల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది. మరోవైపు అత్యాచార ఆరోపణల నేపథ్యంలో టీవీ షో యాజమాన్యం ముకేష్‌ను ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే తొలగించింది.

మరిన్ని వార్తలు