టీవీ చానల్‌ మార్చే విషయంలో గొడవ 

5 Oct, 2019 03:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రోకలిబండతో మోది తండ్రిని చంపిన కుమారుడు 

నల్లగొండ క్రైం: టీవీ చానల్‌ మార్చే విషయంలో తండ్రీకుమారుడి మధ్య జరిగిన గొడవ తండ్రి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఉన్న కుమారు డు రోకలిబండతో తండ్రి తలపై మోదడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పట్టణంలోని ప్రకాశం బజార్‌లో నివాసముంటున్న పెరుమాళ్ల గోవర్ధన్‌ (65) గురువారం రాత్రి భక్తి టీవీ చానెల్‌ చూస్తున్నాడు. అదే సమయంలో కుమారుడు సతీశ్‌ ఆ చానల్‌ను మార్చాలని, తాను టీవీ చూడాలని రిమోట్‌ను తండ్రి చేతుల్లోనుంచి లాక్కున్నాడు.

తండ్రి గోవర్ధన్‌ కూడా తాను భక్తి చానల్‌ చూడాలని కుమారుడిచేతుల్లో నుంచి రిమోట్‌ను తిరిగి లాక్కున్నాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీశ్‌ రోకలిబండ తీసుకుని టీవీని ధ్వంసం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి.. తన కుమారుడి గల్లా పట్టుకున్నాడు. సతీశ్‌ చేతిలో ఉన్న రోకలిబండతో తండ్రి తలపై బలంగా మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమార్తె జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సురేశ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు