బ్యూటీషియన్‌పై దాడి కేసులో ట్విస్ట్‌

27 Aug, 2018 10:41 IST|Sakshi

విజయవాడ: బ్యూటీషియన్‌ పద్మపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్‌ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో ఊహించని మలుపు తిరిగింది. గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లే దారిలో రైలు పట్టాల వద్ద ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నూతన్‌ కుమారేనని తెలిసింది. అక్కడ లభించిన ఆధార్‌ కార్డు ద్వారా మృతదేహం నూతన్‌ కుమార్‌దిగా రైల్వేపోలీసులు, నూతన్‌ భార్య గుర్తించారు. అయితే నూతన్‌ కుమార్‌ మరణంపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నూతన్‌ కుమార్‌ని ఎవరైనా హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మరో నిందితుడు సుబ్బయ్య మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడంతో కేసును చేధించడం క్లిష్టంగా మారింది. బ్యూటీషియన్‌ పద్మ వాగ్మూలంలో చెప్పిన ఆ సుబ్బయ్య ఎవరనేది మిస్టరీగా మారింది. 

వెలుగు చూస్తున్న కొత్త విషయాలు

పద్మ ఎడమ చేతిపై 'ఎన్‌' అనే అక్షరంతో టాట్టూ ఉంది. నూతన కుమార్ గుర్తుగా ఎన్‌ అక్షరంతో టాట్టూ వేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ 'ఎన్‌' అనే అక్షరాన్నే మృతుడు నూతన కుమార్ కత్తితో నరికివేశాడు. అలాగే పద్మ నుదుటి మీద 'ఎస్‌' అక్షరం రాసింది కూడా నూతన కుమారేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నూతన కుమార్, పద్మ మధ్య ఏడాదిగా తీవ్ర విభేదాలు తలెత్తాయి.

 పశ్చిమగోదావరి జిల్లా పెడపాడులో ఇప్పటికే నూతన కుమార్ పై ఎఫ్‌ఐఆర్ నమోదై ఉంది. హనుమాన్ జంక్షన్ పోలీసులకు గతంలో నూతన్‌పై పద్మ ఫిర్యాదు కూడా చేసింది. ఆపై పద్మ రాజీ పడింది. గతంలో ఒకసారి నూతన్‌ కుమార్‌ ఆత్మహత్యా యత్నం కూడా చేసుకున్నట్లు విచారణలో తేలింది. పద్మ భర్త పేరు సూర్యనారాయణ కాబట్టి 'ఎస్‌' అనే అక్షరం బ్లేడ్‌తో రాసి, 'ఎన్‌' అనే అక్షరం కోసేస్తే అది పద్మ భర్తే చేశాడని భావిస్తారని నూతన కుమార్ అలా చేసి ఉండవచ్చునని పోలీసులు నిర్దారణకు వచ్చారు.

>
మరిన్ని వార్తలు