కారు బోల్తా.. ఇద్దరు ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి

17 Dec, 2018 12:34 IST|Sakshi

సాక్షి, కోదాడ: సూర్యాపేట జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆరుగురు ఏపీ సచివాలయ ఉద్యోగులు శని, ఆదివారం సెలవులు ముగించుకుని.. సోమవారం విధులకు హాజరుకావడానికి అమరావతికి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం కోదాడ మండలం దొరకుంట వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు రోడ్డు దిగి దాదాపు 50 మీటర్లు వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతులను భాస్కర్‌ రావు, హరికృష్ణలుగా గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కోదాడలోని విజయ హాస్పిటల్‌కు తరలించారు. మరో ఉద్యోగి విజయలక్ష్మీ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం..
రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగులు మృతిచెందడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు