ఆరిన ఇంటి దీపాలు

22 May, 2019 12:54 IST|Sakshi
చెరువులో నుంచి మృతదేçహాలను బయటకు తీస్తున్న గజ ఈతగాళ్లు

వేసవి సెలవులు సరదాగా గడుపుతున్న ఆ చిన్నారుల జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఈత కొడతామంటూ వెళ్లిన పిల్లలు ఇక తిరిగిరారు అని తెలిసిన ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. నా బిడ్డల నవ్వులు ఇక చూడలేనా అంటూ ఆ తల్లి పెట్టిన ఆక్రందనలు అందరి గుండెలను కలచి వేశాయి. ఈత కోసం వెళ్లి మృత్యువాత పడ్డ అన్నదమ్ములను చూసి గ్రామస్తులు కన్నీటి çపర్యంత
మయ్యారు. 

సిద్దిపేటకమాన్‌:  చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన సిద్దిపేట కొమటి చెరువులో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌ టౌన్‌ సీఐ నందీశ్వర్‌ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణంలోని హనుమాన్‌ నగర్‌కు చెందిన బదనపురం కిషన్, కనకవ్వ దంపతులకు నలుగురు కుమారులు సంతానం ఉన్నారు. వీరిలో మూడవ కుమారుడైన లక్ష్మణ్‌ (15), నాల్గవ కుమారుడైన గణేష్‌ (12) లు ఇద్దరు స్థానిక హనుమాన్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ మధ్యనే  లక్ష్మణ్‌ 5వ తరగతిని, గణేష్‌ మూడవ తరగతిని పూర్తి చేశారు. పాఠశాలకు వేసలవులు కావడంతో  మంగళవారం లక్ష్మణ్, గణేశ్‌ వీరి మిత్రుడైన రాకేశ్‌తో కలిసి ముగ్గురు కొమటి చెరువులో ఈత నేర్చుకోవడానికి వెళ్లారు.

ఈత రాకుండానే చెరువులోకి.. 
ఈ క్రమంలో లక్ష్మణ్, గణేష్‌లు చెరువులోకి దిగారు. వీరు చెరువులోకి దిగిన ప్రాంతం లోతుగా ఉంది. వీరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి పోయారు. ఇది గమనించిన రాకేశ్‌ ఈ విషయం స్థానికులకు తెలియచేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు కొమటి చెరువు వద్దకు చేరుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న సిద్దిపేట వన్‌ టౌన్‌ సీఐ నందీశ్వర్‌ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గజ ఈత గాళ్లను పిలిపించి చెరువులో మునిగిపోయిన విద్యార్థుల మృతహాలను గంటపాటు కష్టపడి వెలికి తీశారు.   మృతిచెందిన పిల్లల మృతదేహలను పోలీసులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ గదికి తరలించారు. ఘటనపై మృతిచెందిన పిల్లల తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
 
మిన్నంటిన రోదనలు.. 
చెరువు నుంచి యటకు తీసిన ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలపైన వారి తల్లిదండ్రులు పడి రోదించిన తీరు అక్కడ ఉన్న వారందరిని కలిచివేసింది. చెరువులో మునిగి ఇద్దరు పిల్లలు చనిపోయారని విషయం తెలుసుకున్న స్థానికులు మృతిచెందిన చిన్నారులను చూడడానికి భారీగా ఆ ప్రాంతానికి వచ్చారు.

రక్షణ చర్యలు లేవు.. 
స్థానిక కొమటి చెరువు వద్ద ఏలాంటి ఈత రాని వారు, చిన్న పిల్లలు కొమటి చెరువులోకి దిగకుండా ఏలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని స్థానికులు వాపోయారు. రక్షణ ఏర్పాట్లు ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. స్థానిక చెరువు వద్ద చిన్న పిల్లలు చెరువులోకి దిగకుండా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు