తెగబడిన గొలుసు దొంగలు

10 Jan, 2019 10:40 IST|Sakshi
వివరాలు సేకరిస్తున్న నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ తదితరులు

ఒకేసారి ఇద్దరు మహిళల మెడలో గొలుసు చోరీలు

ఘటనాస్థలాన్ని పరిశీలించిన నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌  

చిలకలగూడ : చిలకలగూడ ఠాణా పరిధిలోని పద్మారావునగర్‌లో బుధవారం రాత్రి చైన్‌స్నాచర్లు పంజా విసిరారు. నడిచి వెళుతున్న ఇద్దరు మహిళలను టార్గెట్‌ చేసుకుని బైక్‌పై వెనుకనుంచి  వచ్చి  వారి మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్, అడిషనల్‌ డీసీపీ శాంతి శ్రీనివాస్‌ ఘటనస్థలాన్ని పరిశీలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పద్మారావునగర్‌ స్టెర్లింగ్‌ మెజిస్టిక్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న భార్గవి, అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ కుమార్తె శ్రీదేవితో కలిసి బుధవారం రాత్రి సమీపంలోని సూపర్‌మార్కెట్‌కు నడిచి వెళుతుండగా బైక్‌పై వెనకనుంచి వచ్చిన ఇద్దరు దుండగులు వారి మెడలోని బంగారు గొలుసులను తెంపుకుని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్, అడిషనల్‌ డీసీపీ శాంతి శ్రీనివాసరావులతోపాటు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహారాజు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పద్మారావునగర్‌లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు.  నిందితుల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు