నిప్పంటుకుని ఇద్దరు చిన్నారుల మృతి

5 Mar, 2020 11:15 IST|Sakshi
అగ్నిప్రమాదం జరిగిన ఇల్లు సియోన్‌ నాయక్‌(ఫైల్‌) కృపాబాయి (ఫైల్‌)

బొల్లాపల్లి (వినుకొండ): ప్రమాదవశాత్తూ మంటలంటుకుని ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు మరణించిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం గ్రామానికి చెందిన మూఢావతు బాలునాయక్‌కు ఉదయ్‌కుమార్‌ నాయక్, సాంబశివరావు నాయక్, రామారావు నాయక్‌ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు వివాహాలు చేసుకుని పక్కపక్క ఇళ్లల్లోనే నివసిస్తున్నారు.  

ప్రమాదం జరిగిందిలా..
బుధవారం సాయంత్రం సాంబశివరావు నాయక్‌ 30 లీటర్ల పెట్రోలు క్యాను నుంచి ఐదు లీటర్లను మరో క్యానులోకి వంచుతుండగా సమీపంలో కట్టెల పొయ్యి నుంచి నిప్పులు రేగి పెట్రోలుకు అంటుకున్నాయి.  
అక్కడే ఆడుకుంటున్న ఉదయ్‌కుమార్‌ కుమార్తె కృపాబాయి(3)కి మంటలు అంటుకునిఅక్కడికక్కడే మృతి చెందింది.  
సాంబశివరావు నాయక్‌ కుమారుడు సియోన్‌ నాయక్‌ (ఏడాది)కు కూడా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు.  
సియోన్‌ నాయక్‌ను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతిచెందాడు. 

గాయపడ్డ మరో ఇద్దరుప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఉన్న సాంబశివరావు నాయక్‌ భార్య లక్ష్మీబాయి, రామారావు నాయక్‌ భార్య మల్లేశ్వరి బాయి స్వల్పంగా గాయపడ్డారు. కళ్ల ముందే మంటలంటుకుని తమ బిడ్డలు కాలిపోతున్నా కాపాడుకోలేకపోయామని ఉదయ్‌ కుమార్, ఆయన భార్య ఇస్త్రీ బాయి బోరున విలపించారు. వినుకొండ రూరల్‌ సీఐ ఎం.వి.సుబ్బారావు, బండ్లమోటు ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్‌ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.

మరిన్ని వార్తలు