గజ్జరంలో ఘోర రోడ్డు ప్రమాదం

19 Apr, 2018 14:11 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబసభ్యులు

ఇద్దరు స్నేహితుల దుర్మరణం

తాళ్లపూడి: మండలంలోని గజ్జరం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గజ్జరం గ్రామానికి చెందిన దేపాటి అనిల్‌కుమార్‌ (17), రామవరపు మురళి (16) ద్విచక్రవాహనంపై గ్రామంలోని తాళ్లపూడి వైపు వస్తున్నారు.

ఈ సమయంలో తాళ్లపూడి వైపు నుంచి గోపాలపురం వైపునకు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ ఒకరిపై ఒకరు కిందపడ్డారు. వారి తలలకు బలమైన గాయాలయ్యాయి. శరీరభాగాలూ చెల్లాచెదురుగా ముక్కలుగా పడ్డాయి.  çకళ్ల ముందే  జనం చూస్తుండగానే మృత్యువాత పడ్డారు. ఈఘటన  స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. 

ఇద్దరూ స్నేహితులు 

అనిల్, మురళి ఇద్దరూ స్నేహితులు గ్రామంలో బంధువుల ఇంటి వద్ద జరి గిన శుభకార్యంలో పది నిమిషాల ముందు  భోజనం చేసి తాళ్లపూడికి బైక్‌పై బయలుదేరారు. ఇంతలో ఈ ఘోరం జరిగింది. 

ఎదిగొచ్చిన కొడుకులు ఇలా.. 

ఎదిగొచ్చిన కొడుకులు ఇలా మరణించడంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. దేపాటి అనిల్‌కుమార్‌ తణుకు ఎస్‌ఎన్‌వీటీ పాలిటెక్నిక్‌ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చాడు. తండ్రి శ్రీనివాస్, తల్లి పోసమ్మ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు.

మృతునికి ఓ అక్క కూడా ఉంది.  రామవరపు మురళి చిన్న చిన్నపనులు చేసుకుంటూ పదో తరగతి ప్రైవేట్‌గా కట్టి చదువుతున్నాడు. ఇతనికి తండ్రి పోసియ్య, తల్లి లక్ష్మి, చెల్లి ఉన్నారు. తండ్రి ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం కువైట్‌ వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి కూలి పనులు చేస్తుంటుంది.

రెండు కుటుంబాల్లోనూ మగపిల్లలు   కావడంతో ఘటనా స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్నేహితులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. డీఎస్పీ ఆదేశాల మేరకు  తాళ్లపూడి ఎస్సై కె.అశోక్‌ కుమార్, సిబ్బంది ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు