-
శంషాబాద్ రంగారెడ్డి : బోనాల పండుగకు సోదరి ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయల్దేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ మండలం కిస్మత్పూర్ గ్రామానికి చెందిన మధు యాదవ్(25) రాజేంద్రనగర్లోని డీఆర్ఆర్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
బుద్వేల్ బస్తీకి చెందిన నరేష్ యాదవ్ (20) గచ్చిబౌలిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు వరుసకు సోదరులు. మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామంలో వీరి సోదరి ఇంట్లో బోనాల పండుగకు బైక్పై వెళ్లారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు మంగళవారం ఉదయం 6.30 గంటలకు మంఖాల్ నుంచి బయల్దేరారు. మండలంలోని సాతంరాయి వద్ద జాతీయ రహదారిపై 7 గంటల సమయలో ఇద్దరు తలకు తీవ్రగాయాలతో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు, ప్రయాణికులు 108 సమాచారం అందించారు.
అయితే అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు నిర్ధారించి పోలీసులు, సెల్ఫోన్లోని నంబర్ల ఆధారంగా వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకులు ప్రయాణిస్తున్న హోండా యాక్టివా డివైడర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందా..? లేదా ఎదురుగా నిలిపి ఉన్న వాహనాన్ని ఢీకొట్టి మృతిచెందారా..? అన్న కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.
యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ముందు భాగం దెబ్బతినడంతో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అంత్యక్రియలు పూర్తి
రాజేంద్రనగర్ : ఇరువురి మృతితో కిస్మత్పూర్, భగవతిగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాతంరాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మధు యాదవ్, నరేష్ యాదవ్ల అంతక్రియలు మంగళవారం రాత్రి పూర్తయ్యాయి. పోస్టుమార్టం అనంతరం మధు యాదవ్ మృతదేహాన్ని కిస్మత్పూర్లోని నివాసానికి తరలించగా, నరేష్యాదవ్ మృతదేహాన్ని బుద్వేల్ భగవతిగూడకు తరలించారు.
ఇరువురి మృతి వార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిస్మత్పూర్ నర్సింహ, లక్ష్మమ్మ దంపతుల చిన్నకుమారుడు మధుసూదన్యాదవ్. మధుయాదవ్ స్థానికంగా ఉన్న డీఆర్ఆర్లో ఉద్యోగి. స్థానిక యువకులతో పాటు అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. రోడ్డు ప్రమాదంలో మధు మృతి చెందాడని తెలియడంలో కుటుంబ సభ్యులరోదన మిన్నంటాయి.
బుద్వేల్ భగవతిగూడకు చెందిన సత్తయ్య, శారద దంపతుల కుమారుడు నరేష్యాదవ్. ఇతను మధుకు అన్నవరుస అవుతాడు. ఇరువురు సోమవారం మధు సోదరి ఇంటి వద్ద బోనాల పండుగ సందర్భంగా అక్కడకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి ఉదయమే తమ ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. సాతంరాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మధుతో పాటు నరేష్యాదవ్ మృతి చెందారు. నరేష్ మృతితో పెద్ద దిక్కు కోల్పొయామంటూ కుటుంబ సభ్యుల రోదన స్థానికులను కంటతడిపెట్టించింది.