తల్లిడిల్లిన హృదయాలు!

4 Oct, 2019 07:23 IST|Sakshi
కుమార్తె మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న తండ్రి మణికంఠన్, (ఇన్‌సెట్‌) సత్యవతి (ఫైల్‌) ,విషం తాగి ప్రాణాలు కోల్పోయిన అనసూయ, ఐశ్వర్య, విషమ స్థితిలో ఉన్న తల్లి లక్ష్మి, అక్షయ (ఫైల్‌)

తమిళనాడులో ఆత్మహత్యల కలకలం

ఒకే రోజు తల్లి, ఐదుగురు కుమార్తెల బలవన్మరణం

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరో తల్లి, కుమార్తె

కన్నీరుమున్నీరైన బంధువులు

తమిళనాడులో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే ఆరుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. మద్యానికి బానిసైన భర్తతో వేగలేక ఓ మహిళ తనువుచాలించాలని నిశ్చయించుకుంది. తన ముగ్గురు కుమార్తెలను కాలువలో తోసి తనూ దూకేసింది. ఆర్థిక ఇబ్బందులతో మరో ఇల్లాలు తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తనూ సేవించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటనలు తమిళనాడు వ్యాప్తంగా సంచలనమయ్యాయి. బంధువుల ఆర్తనాదాలు చూపరులకు కన్నీళ్లు తెప్పించాయి.   

సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్యానికి బానిసైన భర్తతో విసిగిపోయిన ఒక ఇల్లాలు ముగ్గురు కుమార్తెలతో కలిసి పంటకాలువలోకి దూకేసింది. భర్తను కోల్పోయిన మరో ఇల్లాలు ఆర్థి క ఇబ్బందులతో సతమతమై తన ముగ్గురు కుమార్తెలతో కలిసి విషం తాగేసింది. ఈ రెండు దయనీయ సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు విషమపరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ దయనీయ ఉదంతాల వివరాలు ఇలా ఉన్నాయి.

కడలూరు జిల్లా విరుదాచలానికి చెందిన మణికంఠన్‌ (38), సత్యవతి (29) దంపతులకు ఆంజియ (6), నందిని (4), దర్షిణి (2) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో అక్షయ, నందిని సమీపంలోని ప్రయివేటు పాఠశాలలో చదువుతున్నారు. మణికంఠన్‌మద్యానికి బానిసకావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకునేవి. గత 24న ఇదే రీతిలో ఇద్దరూ గొడవపడగా సత్యవతి ముగ్గురు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సత్యవతికి ఆమె తల్లి నచ్చజెప్పి బుధవారం ఉదయం బస్సు ఎక్కించి భర్త వద్దకు పంపించింది. అయితే భర్త వద్దకు వెళ్లడం ఇష్టంలేని సత్యవతి మార్గమధ్యంలోనే పిల్లలతో కలిసి దిగింది. సాయంత్రం ఆరుగంటల సమయంలో సమీపంలోని పంటకాలువలోకి ముగ్గురు కుమార్తెలతో కలిసి దూకేసింది. స్పృహలేని స్థితిలో సత్యవతి ఒడ్డుకు కొట్టుకురాగా అక్షయ, నందిని ప్రాణాలు కోల్పోయారు. గల్లంతమైన దర్షిణి కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.

తేనీ జిల్లా బోడినాయగంకు చెందిన వ్యాపారి పాల్‌పాండి, లక్ష్మి (36) దంపతులకు ప్లస్‌టూ చదువుతున్న అనసూయ (18), 9వ తరగతి చదువుతున్న ఐశ్వర్య (16), 5వ తరగతి చదువుతున్న అక్షయ (10) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. అనారోగ్యకారణాలతో పాల్‌పాండి రెండేళ్ల క్రితం మరణించాడు. కుట్టుమిషన్‌పెట్టుకుని అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అనసూయను ఆర్థికపరమైన ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైన అనసూయ గురువారం ఉదయం 7 గంటల సమయంలో కాఫీలో విషపూరితమైన మందు కలిపి ముగ్గురు కుమార్తెలకు ఇచ్చి తాను తాగేసింది. పొద్దుపోయినా ఎంతకూ వారు బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగూపొరుగూ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా ప్రాణాపాయ స్థితిలో నలుగురూ నేలపై విలవిల కొట్టుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తల్లీ కుమార్తెలను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలొ చికిత్స పొందుతూ అనసూయ, ఐశ్వర్య ప్రాణాలు విడిచారు. తల్లి లక్ష్మి, మరో కుమార్తె అక్షయ విషమపరిస్థితిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు