‘మహర్షి’ సినిమా చూసి వస్తుండగా..

11 May, 2019 09:03 IST|Sakshi
కేతావత్‌ రూఫ్‌సింగ్, కేతావత్‌ గోపాల్‌నాయక్‌ (ఫైల్‌)

ఇద్దరిదీ ఒకే ఊరు.. పక్క పక్క నివాసాలు కావడంతో చిన్నప్పటి నుంచే వారిలో స్నేహబంధం చిగురించింది. ఎక్కడికి వెళ్లినా.. ఏ పనిచేసినా ఇద్దరూ కలిసి వెళ్లేవారు.. అదే తరహాలో ఇద్దరూ కలిసి తమ అభిమాన సినీ హీరో మహేశ్‌ బాబు నటించిన ‘మహర్షీ’ సినిమా చూసి ఇంటికి వెళుతూ అనుకోని ప్రమాదంలో మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ విషాదకర ఘటన గురువారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో దామరచర్ల మండలం దిలావర్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధి మిట్టతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మిర్యాలగూడ టౌన్‌ : దామరచర్ల మండలం దిలావర్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధి మిట్టతండాకు చెందిన కేతావత్‌ రూప్‌సింగ్‌(20), కేతావత్‌ గోపాల్‌నాయక్‌(20) పట్టణంలోని ఓ సెల్‌ షాపులో పని చేస్తుంటారు. రోజూ మాదిరిగానే విధులకు హాజరై ఈ ఇద్దరు స్నేహితులు కొత్త సినిమా రావడంతో రెండవ ఆట చూసి మిర్యాలగూడ నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో  ముత్తిరెడ్డికుంట సమీపంలో అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌ ఖలీల్‌ దాబా వద్ద రోడ్డు దాటుతున్న గేదెను రాత్రి 12:30గంటల సమయంలో వీరి బైక్‌ ఢీకొట్టింది. దీంతో కేతావత్‌ రూప్‌సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందగా కేతావత్‌ గోపాల్‌నాయక్‌ తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇద్దరినీ స్థానిక ఏరియా ఆస్పత్రికి  అక్కడి నుంచి గోపాల్‌నాయక్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు.

సెల్‌ షాపుల బంద్‌
ఇద్దరు యువకులు పట్టణంలోని సెల్‌ షాపుల్లో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ దుకాణాల నిర్వాహకులు సంతాప సూచకంగా శుక్రవారం బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా మోబైల్‌ అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ నిత్యం నవ్వుకుంటూ ఉండే ఈ ఇద్దరు యువకులు ఆకాల మృతి తీరనిలోటన్నారు. వారి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సెల్‌ ఫోన్‌ దుకాణాల నిర్వాహకులు హనుమయ్య, దేవిరెడ్డి నరేష్‌రెడ్డి, రాజశేఖర్, నాగరాజు, మసూద్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు