కానూరులోని వినాయక్నగర్లో ఒకరు, సనత్నగర్లో మరొకరు ఉరి వేసుకుని బలవన్మరణం
అనుమానాస్పద కేసులు నమోదు చేసిన పోలీసులు
కానూరు (పెనమలూరు) : మండలంలోని కానూరులో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువతులు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. కానూరు వినాయక్నగర్కు చెందిన చేశెట్టి లక్ష్మీతులసి (25) డిగ్రీ చదివి ఇంట్లో ఉంటోంది. ఆమెకు ముగ్గురు అక్కలు ఉన్నారు. ఇద్దరికి పెళ్లి అయ్యింది. లక్ష్మీతులసితో పాటు మరో అక్కకు వివాహం కావాల్సి ఉంది. కాగా ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మీతులసి చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ లక్ష్మీతులసి కడుపు నొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గామహేశ్వరరావు తెలిపారు.
సనత్నగర్లో మరో యువతి..
కానూరు సనత్నగర్ రేకుల మసీదు సమీపంలో పూర్ణప్రసాద్ కుటుంబం ఉంటోంది. అతనికి లక్ష్మీహైమావతి (19) అనే కుమార్తె ఉంది. ఆమె పాలిటెక్నిక్ పూర్తి చేసి కానూరు అశోక్నగర్లోని ఓ కాల్ సెంటర్లో పని చేస్తోంది. అదే కాల్ సెంటర్లో పని చేస్తున్న ఆమె మిత్రురాలి స్నేహితుడు రెండురోజుల క్రితం లక్ష్మీహైమావతి ఇంటి వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా పూర్ణప్రసాద్ చూసి అతనిని మందలించాడు. కాల్ సెంటర్కు రూడా వెళ్లి లక్ష్మీహైమావతి మిత్రురాలిని కూడా హెచ్చరించాడు. ఈ క్రమంలో విధులకు హాజరైన లక్ష్మీహైమావతిని దీనిపై ఆమె మిత్రురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీహైమావతి సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.