దారికోసం ఇరువర్గాల ఘర్షణ

15 Sep, 2019 07:43 IST|Sakshi

సాక్షి, వెదురుకుప్పం : దారికోసం ఇరువర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డాయి. పరస్పర దాడులతో పలువురు తీవ్రంగా గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. వెదురుకుప్పం ఎస్‌ఐ సుమన్‌ కథనం మేరకు...మండలంలోని మాంబేడు గ్రామానికి సమీపంలోని దాంట్లవారిఇండ్లకు చెందిన భాస్కర్‌రెడ్డి, హేమచంద్రారెడ్డికి కొన్నేళ్లుగా దారి విషయమై తగా దాలు ఉండేవి. అప్పుడప్పుడు ఘర్షణ పడుతున్నారు. శనివారం ఉదయం హేమచంద్రారెడ్డి, మహేష్, పురుషోత్తంరెడ్డి, శ్రావణి, కుమారి, హేమంత్‌కుమార్‌ కలిసి అదే గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి(55)కి సంబంధించిన పొలంలో ఉన్న మామిడి చెట్లను నరుకుతున్నారు.

అదే సమయానికి భాస్కర్‌రెడ్డి భార్య సంపూర్ణమ్మ పాలు తీసుకెళుతండగా గమనించి, అడ్డుతగిలింది. ఆరుగురు కలిసి సంపూర్ణమ్మపై దాడికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేసి రక్తగాయం చేశారు. గమనించిన భర్త భాస్కర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ప్రతిఘటించే ప్రయత్నం చేయగా అతినిపై కూడా కత్తులతో దాడి చేసి గాయపరిచారు. భాస్కర్‌రెడ్డి కుమారులతో పాటు ఆయన బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యర్థులు హేమచంద్రారెడ్డి, హేమంత్‌కుమార్, పురుషోత్తంరెడ్డి, కుమారిపై దాడి చేసి రక్తగాయాలు చేశారు. ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో గమనించిన స్థానికులు వెంటనే వెదురుకుప్పం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సుమన్‌తో పాటు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. 

మరిన్ని వార్తలు