ఇద్దరు బలవన్మరణం

7 Apr, 2018 09:54 IST|Sakshi
కల్పన (ఫైల్‌)

కడపలో యువతి..

ఈనెల 11 తేదీన వివాహం జరగనుండగా సంఘటన

వేరే యువతిని పెళ్లి చేసుకుంటాననిబెదిరించేవాడని ఫిర్యాదు

కడప అర్బన్‌ : కడప నగరంలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్‌ పరిధి  ఓం శాంతినగర్‌లో నివసిస్తున్న ఎన్‌.చెన్నమ్మ అలియాస్‌ చిన్ని అలియాస్‌ నేహ (23) అనే యువతి శుక్రవారం  ఆత్మహత్యకు పాల్పడింది.  తాను నివసిస్తున్న ఇంటి బెడ్‌రూములో ఫ్యానుకు చీరెతో ఉరేసుకుంది.   చిన్నచౌకు ఎస్‌ఐ రాధాకృష్ణ సంఘటన స్థలాన్ని  సిబ్బందితో కలిసి పరిశీలించారు. స్థానికులు, బం«ధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం చిన్న గెలిగనూరుకు చెందిన చెన్నమ్మ కడప నగరలలోని ఓ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. కడప నగరం చిన్నచౌకు పరిధిలోని ముత్తరాసుపల్లెకు చెందిన జి.శ్రీను (24)    ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ ఈనెల 11 తేదీన వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఓం శాంతినగర్‌లో నెల రోజుల నుంచి ఇరువురు సహజీవనం చేస్తున్నారు.  అయితే మరో యువతిని వివాహం చేసుకుంటానని చెన్నమ్మతో అప్పుడప్పుడు గొడవ పడేవాడు. ఈ క్రమంలో గత రాత్రి తాము ఉంటున్న ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చెన్నమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతికి శ్రీనునే కారణమని మృతురాలి తండ్రి చెన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ రాధాకృష్ణ తెలిపారు.

వల్లూరులో వివాహిత..భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులే కారణం:
వల్లూరు : అత్తింటి వేధింపులు గర్భిణి ప్రాణాన్ని బలిగొన్నాయి. తల్లిదండ్రులు, బంధువులను ఎదిరించి ప్రేమించిన వాన్ని కులాంతర వివాహం చేసుకుని కాపురానికి వచ్చిన ఆమెకు భర్త వేధింపులే జీవితంపై విరక్తిని కలిగేలా చేశాయి. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది. ఈ సంఘటన వల్లూరు మండలంలోని పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీలో శుక్రవారం జరిగింది. వల్లూరు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. ఎస్సీ కాలనీకి చెందిన గొడ్డు సన్నికుమార్‌ అదే మండలంలోని దుగ్గాయపల్లెకు చెందిన కల్పన అనే యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో.. ఆమె పెద్దలను, బంధువులను వదులుకుని నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇప్పటికే ఒకటిన్నరేళ్ల పాప వుండగా.. కల్పన ప్రస్తుతం గర్భవతి. కొంత కాలంగా ఆమెను భర్త సన్నికుమార్‌తోపాటు అత్త రూతమ్మ, ఆడపడుచు శ్రావణి వేధింపులకు గురి చేసే వారు. దీంతో వారి వేధింపులకు తట్టుకోలేక కల్పన శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి వెనుక భాగాన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కల్పన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త సన్నీకుమార్, అత్త రూతమ్మ, ఆడపడుచు శ్రావణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భర్త వివాహేతర సంబంధాలూ కారణమా?
 భర్త సన్నికుమార్‌ ఇంటిలో అడుగుపెట్టిన  కల్పనకు కొద్ది నెలలకే అతని నిజ స్వరూపం తెలిసిందని, పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నట్లు పసిగట్టిందని, అయితే చేసేదేమీలేక అలాగే భరిస్తూ వచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సన్ని కుమార్‌  ఇటీవల కమలాపురం పట్టణానికి చెందిన ఒక వివాహితను సైతం వలలో వేసుకుని చెట్టాపట్టాల్‌గా తిరగడం, కొన్ని రోజులు ఇద్దరు కలిసి కనిపించకుండా పోవడం జరిగాయని, ఈ విషయం తెలుసుకున్న కల్పన భర్తను నిలదీసిందని, అప్పటి నుంచి వేధింపులు తీవ్రమయ్యాయని, దీంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వారు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు