హోటల్‌ గది అద్దె చెల్లించాలన్నందుకు దాడి: ఇద్దరు యువకుల అరెస్టు

9 Sep, 2019 10:46 IST|Sakshi

కాచిగూడ: ఫంక్షన్‌ చేసుకునేందుకు ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని బకాయి ఉన్న బిల్లు డబ్బులు చెల్లించాలని కోరినందుకు హోటల్‌ యాజమాన్యంపై దాడిచేసిన ఇద్దరు యువకులను నారాయణగూడ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్‌ ప్రాంతానికి చెందిన మచ్చ రోహన్‌ హైదర్‌గూడలో రాస్తా కేఫ్‌ నిర్వహిస్తున్నాడు. టిక్‌ టాక్‌ బృందం ఫంక్షన్‌  చేసుకునేందుకు శనివారం రూ.10 వేలకు ఒక గదిని అద్దెకు తీసుకోగా అడ్వాన్స్‌గా రూ.4 వేలు చెల్లించారు. ఫంక్షన్‌ ముగిసిన తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని అడగడంతో బృందం సభ్యులకు మచ్చ రోహన్‌కు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. 

సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన హసీబ్‌ అహ్మద్‌ అన్సారీ, హఫీజ్‌ అహ్మద్‌ అన్సారీలతో పాటు మరో ముగ్గురు యువకులు మచ్చ రోహన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో రోహన్‌ కాలు విరిగింది. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కాచిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రోహన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ పుటేజీలో లభ్యమైన ఆధారాలతో ఇద్దరు యువకులను గుర్తించి ఆదివారం అరెస్ట్‌ చేశారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు