ప్రియుడితో ఏకాంతానికి అడ్డుపడిందని..! 

27 Nov, 2019 06:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ప్రియుడితో ఏకాంతంగా గడిపిన విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని మందలించిన మహిళను ఇద్దరు మైనర్‌ విద్యార్థులు హత్య చేశారు. వివరాలు..కొడైక్కెనాల్‌ సమీపంలోని పణైక్కాడు ప్రాంతానికి చెందిన కేశవన్, భార్య సుందరి (31). వీరికి 11 ఏళ్ల కుమార్తె ఉంది. తరచూ మనస్పర్థలు రావడంతో మూడేళ్ల క్రితం ఇద్దరూ విడిపోయారు. కుమార్తెను కేశవన్‌ పెంచుతున్నాడు. సుందరికి అంతకు ముందే అదే ప్రాంతానికి చెందిన మురుగన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. మురుగన్‌ చెన్నైలో పనిచేస్తుండడం వల్ల సుందరి ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 21న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

కొత్త మలుపు...
ఇందులో హత్య జరిగిన రోజు రాత్రి సుందరి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన ఆమె బంధువు కుమార్తె (16) ఉన్నట్లు తెలిసింది. ఆమె ప్లస్‌ వన్‌ చదువుతోంది. దీంతో పోలీసులు విద్యార్థిని వద్ద విచారణ జరిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు..దిండుగల్‌లో తనతో పాటు చదువుకుంటున్న ఓ విద్యార్థి (16) తాను ప్రేమించుకుంటున్నామని..సుందరి ఇంట్లో లేని సమయంలో ఇద్దరం ఏకాంతంగా గడిపేవారమని తెలిపింది. హత్య జరిగిన రోజు రాత్రి ఇద్దరం ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో సుందరి వచ్చిందని..ఇద్దరిని చూసి తీవ్రంగా మందలించిందని చెప్పింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించిందని..భయంతో సుందరిని చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు వివరించింది. అనంతరం తన ప్రియుడు పారిపోగా తాను అక్కడే ఉండి సుందరి హఠాత్తుగా మృతి చెందినట్లు నాటకమాడినట్లు ఒప్పుకుంది. పోలీసులు పారిపోయిన బాలుడి కోసం గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు