మాయమాటలు చెప్పి..డబ్బులు కాజేసి..

18 Apr, 2018 12:39 IST|Sakshi
మోసపోయిన భోజన్న

భైంసాలో పట్టపగలే మోసం 

రూ.20వేలు పోగొట్టుకున్న బాధితుడు

భైంసా(ముథోల్‌): భైంసాలోని ఆంధ్రాబ్యాంకులో తన సేవింగ్‌ ఖాతాలో దాచుకున్న డబ్బును తీసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి రూ.20వేలు కాజేసిన ఉదంతమిది. సోమవారం కుభీర్‌ మండలం కుప్టి గ్రామానికి చెందిన భోజన్న ఆంధ్రాబ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకునేందుకు భైంసాకు వచ్చాడు. బ్యాంకులో డబ్బులు తీసుకొని బయటకు రాగానే రోడ్డుపైన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై భోజన్న వద్దకు వచ్చారు. డబ్బులు తక్కువ వచ్చాయని తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్తే మిగతావి వస్తాయని మాయమాటలు చెప్పారు. దీంతో భోజన్న నమ్మి రూ.20వేలను వారి చేతిలో పెట్టాడు. వారు బైక్‌పై వెళ్లగా వెనకాలే భోజన్న వెళ్లాడు.

కార్యాలయంలోనికి వెళ్లి వస్తామని ఇద్దరిలో ఒకరు లోపలికి డబ్బులతో వెళ్లారు. మరోవ్యక్తి భోజన్నతో మాట్లాడుతూ ఉండిపోయాడు. కాసేపటికి ఉన్న వ్యక్తి కూడా మాయమయ్యాడు. తనతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడంతో భోజన్న కార్యాలయంలోనికి వెళ్లి చూశాడు. అప్పటికే కార్యాలయం పక్క నుంచి నగదుతో వారు పరారయ్యారు. అక్కడికి భోజన్నకు తెలిసిన వ్యక్తులు రావడంతో జరిగిన ఘటనను వారికి వివరించాడు. డబ్బులు తీసుకుని ఇద్దరు వ్యక్తులు ఉడాయించారని నిర్ధారించుకున్న వారు భైంసా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు.

మరిన్ని వార్తలు