ప్రాణాలపైకి తెచ్చిన దొంగల భయం

28 May, 2018 11:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టెక్కలి రూరల్‌: దొంగలు వస్తున్నారంటూ స్థానికులు కేకలు వేయడంతో మేడపై నిద్రిస్తున్న ఇద్దరు యువకులు భయంతో దూకేసి గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మేజర్‌ పంచాయతీ పరిధిలోని ఆదిఆంధ్రవీధిలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిర్రి అరుణ్‌కుమార్, దేవాది శ్యామలరావు.. తన స్నేహితులతో కలసి సమీపంలోని ఒక మెట్లు లేని మేడపై పడుకున్నారు. ఆదివారం వేకువజామున స్నేహితుల్లో ఒకరు నిచ్చెనపై నుంచి మేడ ఎక్కడాన్ని స్థానికులు గమనించి.. దొంగలు మేడెక్కుతున్నారంటూ బిగ్గరగా అరవడం ప్రారంభించారు.

దీంతో ఉలిక్కిపడి లేచిన అరుణ్‌కుమార్, శ్యామలరావు.. మేడపై నుంచి కిందకు గెంతేశారు. దీంతో వీరిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అరుణ్‌కుమార్‌ కోమాలోకి వెళ్లిపోయారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.   

మరిన్ని వార్తలు