యువకుడిపై బాంబు దాడి

22 Apr, 2019 10:06 IST|Sakshi

బరంపురం: గోపాలపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొడగుమలా గ్రామంలో నివాసముంటున్న సుశాంత్‌ సాహు అనే యువకుడిపై కొంతమంది దుండగులు ఆదివారం బాంబుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో సదరు యువకుడు అక్కడికక్కడే చనిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఈ విషయం సంచలనం రేకిత్తిస్తోంది. ఇదే విషయాన్ని తెలుసుకున్న గోపాలపూర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్‌పీ పినాకి మిశ్రా, ఏఎస్‌పీ ప్రభాత్‌చంద్ర రౌత్‌రాయ్‌ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, గ్రామంలో నెలకొన్న శాంతి భద్రతలను పర్యవేక్షించారు.  వివరాలిలా ఉన్నాయి.. గోపాలపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న బొడగుమలా గ్రామంలోని తన ఇంటి వద్ద ఉన్న తన స్నేహితులతో కలిసి, సుశాంత్‌ సాహు శనివారం రాత్రి 9 గంటల సమయంలో మొబైల్‌లో క్రికెట్‌ చూస్తున్నాడు.

అదే సమయంలో రెండు బైకులపై మాస్కులు ధరించుకుని, వచ్చిన దుండగులు సుశాంత్‌ను టార్గెట్‌గా చేసుకుని, రెండు బాంబులు విసిరారు. అందులో ఒక బాంబు సుశాంత్‌పై పడి, పేలగా మరొకటి నేలపై పడి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో సుశాంత్‌ సాహు శరీరం తునాతునకలై పోయింది. ఇదే విషయమై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుశాంత్‌ హత్యకు సుశాంత్‌కు ఇతరులతో ఉన్న పాత శత్రుత్వమే కారణమని పోలీసులు తేల్చి చెప్పారు. దాదాపు 3 ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్‌ ఎదుట సుశాంత్‌ సాహు తల్లిపై కూడా బాంబు దాడి జరిగిందని, ఇదే కేసులో జామీనుపై విడుదలైన వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే విషయంపై సమగ్ర విచారణ జరిపి, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఎస్‌పీ పినాకి మిశ్రా తెలిపారు.

>
మరిన్ని వార్తలు