కత్తులతో ఒకరిపై ఒకరు దాడి

16 Oct, 2019 10:35 IST|Sakshi

సాక్షి, కాజీపేట : పాత గొడవలను మనసులో పెట్టుకుని ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒక్కరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..  కాజీపేట పట్టణం బాపూజీనగర్‌ ప్రాంతంలో అడ్డాను ఏర్పాటు చేసుకుని ఆటో యూనియన్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీజిల్‌కాలనీకి చెందిన బబ్లూ, ఎర్ర రాజేష్‌ రెండు వర్గాలుగా విడిపోయి పోటీపడ్డారు. ఎన్నికలు సజావుగా ముగిసినప్పటికీ వీరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు పెరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల్లో బబ్లూ, రాజేష్‌లు రెండుసార్లు ఘర్షణలు పడ్డారు. మంగళవారం సాయంత్రం అడ్డాపై ఉన్న రాజేష్‌పై బబ్లూ దాడి చేయడంతో ఘర్షణ పడ్డారు. దీంతో ఇద్దరికీ గాయాలు కాగా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరినీ ఆస్పత్రికి పంపించి పోలీసులు ఘటన విషయమై విచారిస్తున్నారు.  

మరిన్ని వార్తలు