న్యూజిలాండ్‌ పంపిస్తామని లక్షలు దోచుకున్నారు

30 Jul, 2019 09:02 IST|Sakshi

సాక్షి, సారంగాపూర్‌(జగిత్యాల) : న్యూజిలాండ్‌ పంపిస్తానని ఓ యువకుడిని మోసగించిన ఇద్దరిపై సారంగాపూర్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. మండలంలోని  పోచంపేట గ్రామానికి చెందిన శీలం రాజేశం కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రాయికల్‌ మండలం అల్లీపూర్‌ గ్రామానికి చెందిన అత్తినేని రాజిరెడ్డి, రాజేశంను కలిసి మీ కుమారుడిని న్యూజిలాండ్‌కు పంపించడానికి ఆంధ్రపదేశ్‌లోని గుంటూర్‌ జిల్లాకు చెందిన గుంటుక శ్రీకాంత్‌రెడ్డి ఉన్నాడని తెలిపాడు.

రాజేశం, ఆయన కుమారుడు ప్రవీణ్‌లు రాజిరెడ్డి చెప్పిన మాటలు నమ్మారు. శ్రీకాంత్‌రెడ్డి, రాజిరెడ్డి ఇద్దరు కలిసి రాజేశం, ప్రవీణ్‌ వద్దకు వచ్చి న్యూజిలాండ్‌ వెళ్లడానికి రూ. 2.50 లక్షలు ఖర్చు అవుతుందని, అక్కడ మంచి కంపెనీలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి నకలీ పత్రాలను వారికి చూపించారు. వీరి మాటలు నమ్మిన బాధితులు నెల క్రితం రూ.2.50 లక్షలు శ్రీకాంత్‌రెడ్డి చేతిలో పెట్టారు. న్యూజిలాండ్‌కు రేపుమాపు వెళ్లడం అంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన రాజేశం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

మరిన్ని వార్తలు