స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఇద్దరు మృతి

29 Apr, 2019 11:15 IST|Sakshi
షోయబ్‌ఖాన్‌ మృతదేహం ప్రసన్నబాబు మృతదేహం 

మొయినాబాద్‌: వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సహంగా గడిపేందుకు ఫాంహౌస్‌కు వచ్చిన ఓ యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో ముగిని మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని తోలుకట్ట సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలోని బహదూర్‌పూర, కిషన్‌భాగ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సయ్యద్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆదివారం మొయినాబాద్‌ మండల పరిధిలోని తోలుకట్ట సమీపంలో ఉన్న ఒయాసిస్‌ ఎన్‌ ఫాంహౌస్‌కు ఉదయం 10 గంటలకు వచ్చారు.

సయ్యద్‌ ఖాన్‌ కుమారుడు షోయబ్‌ఖాన్‌(20), బంధువుల పిల్లలు ముగ్గురు కలిసి ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్‌పూల్‌ వద్దకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగిన సోయబ్‌ఖాన్‌ ఎక్కువ నీళ్లు ఉన్నవైపు వెళ్లాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
 
ఈతరాక నీటమునిగిన బాలుడు

రాజేంద్రనగర్‌: స్విమ్మింగ్‌పూల్‌లో నీట మునిగి ఓ బాలుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గండిపేట గ్రామంలో ఉన్న డ్యూడ్రాం ప్రైవేటు ఫాంహౌస్‌కు హయత్‌నగర్‌కు చెందిన రాజు కుటుంబం వచ్చింది. వారంతా కలిసి ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈత కొడుతున్న క్రమంలో అతని కుమారుడు ప్రసన్న బాబు (7) నీటిలో మునిగిపోయాడు. విషయాన్ని గమనించేలోపే అతను నీట మునిగి మృతిచెందాడు. హుటాహుటిన బాలుడిని మొయినాబాద్‌లోని భాస్కర ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. నార్సింగి పోలీసులకు రాత్రి వరకు బాధితులు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని సీఐ రమణగౌడ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు