ఇద్దరి ప్రాణాలు బలిగొన్న సెల్ఫీ మోజు 

30 Oct, 2019 12:30 IST|Sakshi

టీ.నగర్ ‌: తమిళనాడులో సెల్ఫీ మోజు సోమవారం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రానికి చెందిన హరి ఓం సింగ్‌ వేలూరులోని ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీన హరి ఓం సింగ్‌ కాట్పాడి సమీపంలోగల సేవూరు రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్సు రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీ దిగుతున్న సమయంలో ఒక్కసారిగా హై ఓల్టేజ్‌ విద్యుత్‌ తీగలు తగిలి హరిఓం సింగ్‌ షాకుకు గురై గాయపడ్డాడు. దీంతో హరి ఓం సింగ్‌ను వెంటనే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మిలటరీ ఆసుపత్రిలో చేర్పించగా 23రోజులుగా మృత్యవుతో పోరాడిన హరి ఓం సింగ్‌ మంగళవారం మృతిచెందాడు. 

మరో ఘటనలో వేలూరు జిల్లా వాణియంబాడి కలంద్ర గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి మృతి చెందాడు. మురళి తన స్నేహితులైన మణికంఠన్‌, విజయ్‌కుమార్‌లతో కలిసి పోలూరు సమీపంలోని జమునామరత్తూరు కొండకు సోమవారం విహారయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో మురళి, మణికంఠన్‌లు బండ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు సెల్ఫీ దిగుతుండగా జారి పడడంతో మురళికి బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.
 

మరిన్ని వార్తలు