రోడ్డు ప్రమాదంలో తెగిన చెయ్యి

23 Apr, 2018 11:30 IST|Sakshi
ప్రమాద స్థలంలో శంకర్‌ ,తీవ్రంగా గాయపడ్డ శంకర్‌

కూసుమంచి: ద్విచక్ర వాహనంపై ముగ్గురు స్నేహితులు వెళుతున్నారు. వారి బైక్‌ను డీసీఎం డీకొంది. ఆ ముగ్గురిలో ఒకరి చేయి పూర్తిగా తెగిపోయింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం కూసుమంచిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పాలేరుకు చెందిన చెరుకుపల్లి శంకర్,  వల్లెపు వెంకన్న, బత్తుల ఉపేందర్‌ బిల్డింగ్‌ వర్కర్లు. వీరు ముగ్గురూ కలిసి బైక్‌పై పాలేరు నుంచి కూసుమంచి వైపు వస్తున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలోకి రాగానే, రోడ్డు క్రాస్‌ చేసేందుకని మధ్యలో కూర్చున్న  శంకర్‌ తన చేతిని చాచాడు. ఇదే సమయంలో ఖమ్మం నుంచి పాలేరు వైపు వేగంగా వెళుతున్న డీసీఎం.. ఆ చేతిని ఢీకొంది. దీంతో శంకర్‌ చేయి గూడ కింది భాగం వరకు పూర్తిగా తెగిపడింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర్‌ చేయి తెగిపడటంతో పాటు తలకు దెబ్బలు తగిలాయి. వారిని, తెగిన చేతిని 108 సిబ్బంది ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. శంకర్‌ పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌ గాం«ధీ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ రఘు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు