దూరమవుతామనే భయంతో.. స్నేహితుల ఆత్మహత్య

18 May, 2020 07:12 IST|Sakshi

సాక్షి, తిరువొత్తియూరు: పెళ్లి చేసుకుంటే స్నేహితురాలికి దూరమవుతాననే భయంతో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎలచ్చిపాళయంలో చోటుచేసుకుంది.  నామక్కల్‌ జిల్లా ఎలచ్చిపాళయం సమీపంలోని ఎలయంపాళయంకు చెందిన నందకుమార్‌ భార్య జ్యోతి (23). వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. జ్యోతి తండ్రి కృష్ణమూర్తి, తల్లి సరోజ ఆరు నెలలుగా కేరళలో కూలి పనులు చేస్తున్నారు. జ్యోతి భర్త నుంచి విడిపోయి పెరియ మణలిలో ఉన్న తల్లిదండ్రుల ఇంటిలో ఉంటోంది. అదే ప్రాంతంలోని నేతపట్రలో పని చేస్తోంది. ఇదే చోట కోట్టపాళయంకు చెందిన షణ్ముగం కుమార్తె ప్రియ (20) పని చేస్తోంది. ప్రియ తండ్రి మరణించడంతో తల్లి శ్వేతతో కలిసి ఉంటోంది. జ్యోతి, ప్రియ ఒకే చోట పనిచేస్తుండడం వల్ల ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

ఈ నెల 27న ప్రియకు వివాహం చేయడానికి నిశ్చయించారు. వివాహం చేసుకుంటే జ్యోతి నుంచి దూరమవుతానని ప్రియ ఆందోళన చెందినట్లు తెలిసింది. శనివారం ప్రియ జ్యోతి ఇంటికి వచ్చింది. అనంతరం ఇద్దరూ ఒకే చీరకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియ చాలాసేపు అయినా ఇంటికి రాకపోవడంతో తల్లి శ్వేత జ్యోతి ఇంటికి వెళ్లింది. లోపల తాళం వేసి ఉండడంతో స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టారు. ఇద్దరూ ఒకే చీరలో ఉరి వేసుకుని శవాలుగా వేలాడుతూ కనిపించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎలచ్చిపాళయం పోలీసులు మృతదేహాలను శవపరీక్ష కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు