వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల ఆత్మహత్య

4 Jun, 2018 11:11 IST|Sakshi
ప్రేమ్‌లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు 

కుటుంబ కలహాలే కారణం

కొల్చారం(నర్సాపూర్‌) : మండలంలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన తాండాకు చెందిన లంబాడి లక్ష్మణ్‌ భార్య ప్రేమ్‌లి(45) ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందును సేవించడంతో చికిత్స కోసం మెదక్‌ తరలిస్తుండగా మార్గమద్యంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రేమ్‌లి మృతికి కుటుంబ కలహాలే కారణమని కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ పెంటయ్య తెలిపారు. పదిహేను రోజుల నుంచి ప్రేమ్‌లికి, భర్త లక్ష్మణ్, కుమారులకు మధ్య గొడవలు జరగినట్లు తెలిసింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం సైతం గొడవ జరగడం, కుమారుడు చేయి చేసుకోవడంతో పనస్థాపం చెందిన ప్రేమ్‌లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

పైతరలో : మండల పరిధిలోని పైతర గ్రామానికి చెందిన బోయిని మల్లేశం భార్య రాజమణి(35) కుటుంబ కలహాల కారణంగా మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగినట్లు గ్రామస్థులు తెలిపారు. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ పెంటయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు