వనభోజనంలో విషాదం

6 Nov, 2017 08:40 IST|Sakshi

‘మంజీరా’లో పడి ఇద్దరు యువతుల గల్లంతు

మల్కాజిగిరి: వనభోజనాలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. కార్తీకమాసంలో సరదాగా వనభోజనాలకు వెళ్లిన ఇద్దరు యువతులు మంజీరానదిలోపడి గల్లంతయ్యారు. స్థానికుల కథనం మేరకు.. మల్కాజిగిరి  వెంకటేశ్వరనగర్‌లోని రాఘవేంద్ర అపార్ట్‌మెంట్స్‌లో  నివాసముంటున్న వసంత, భ్రమరాంభిక నగర్‌ సాయి సుబ్రహ్మణ్యం రెసిడెన్సీలో ఉంటున్న శ్రీవిద్య(21) ఇద్దరూ ఒకేచోట పనిచేస్తుంటారు. ఆదివారం వారు పనిచేసే మహిళా ఉద్యోగులంతా కలిసి  మెదక్‌ జిల్లా జోగిపేట సమీపంలో ఉన్న చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్దకు వనభోజనాలకు వెళ్లారు. సమీపంలోని మంజీరా నది ఒడ్డున ఫొటోలు తీసుకుంటుండగా వసంత కూతురు రోహిత(17), శ్రీ విద్య(21) ప్రమాదవశాత్తు నదిలో జారిపడ్డారు.

అక్కడున్న వారు  రక్షించడానికి ప్రయత్నించినా నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకొని పోయారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు  గాలించినా ఫలితం లేకపోయింది. శ్రీ విద్య తండ్రి సతీష్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా తండ్రికి చేదోడుగా తను ప్రైవేట్‌గా చదువుతూ ఉద్యోగం చేస్తున్నది.రోహిత స్ధానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి సత్యనారాయణ ఫార్మా కంపె నీలో పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు