బైక్‌ను ఢీకొన్న లారీ

24 Feb, 2020 09:47 IST|Sakshi
సురేష్, ఖాజా మోయియుద్దీన్‌ (ఫైల్‌)

ఇద్దరు యువకుల దుర్మరణం

హయత్‌నగర్‌: బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నలగొండ జిల్లా, నకిరెకల్‌లోని మాయాబజార్‌ ప్రాంతానికి చెందిన సురేష్‌ (19) ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని రహమత్‌నగర్‌కు చెందిన ఖాజా మోయియుద్దీన్‌ అలియాస్‌ సోహెల్‌(20) అతడికి స్నేహితుడు ఆదివారం ఉదయం నల్లగొండ వెళ్లేందుకు బయలుదేరిన వీరు అటు వెళ్లకుండా నగరం వైపు వచ్చారు. హయత్‌నగర్‌ సమీపంలోని లక్ష్మారెడ్డి పాలెం వద్దకు రాగానే పక్కనుంచి వెళుతున్న మరో వాహనం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌ నడుపుతున్న ఖాజా మెయియుద్దీన్‌ వెనుక సీటులో కూర్చున్న సురేష్‌ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో మరోపక్క నుంచి వెళుతున్న బీఎంఎస్‌ కంపెనీకి చెందిన లారీ చక్రాలు వారి తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని మహిళ మృతి...
లారీ ఢీకొనడంతో చర్చికి వెళుతున్న ఓ మహిళ మృతి చెందిన సంఘటన హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హయత్‌నగర్‌ డివిజన్, ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన గండి ఎలిజబెత్‌(74) ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి. ఆదివారం ఉదయం ఆమె చర్చికి వెళ్లేందుకు పోలీస్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారిని దాటుతుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు డానియల్‌ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు