బైక్ను ఢీకొట్టిన లారీ
ఇద్దరు యువకుల దుర్మరణం
అల్గునూరు శివారులో ఘటన
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్) : తెల్లవారుజామున్నే ఇద్దరు యువకుల బతుకులు తెల్లారిపోయాయి. శుక్రవారం ఉదయం కరీంనగర్– వరంగల్ రహదారి రక్తసిక్తమైంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎల్ఎండీ ఎస్సై నరేశ్రెడ్డి కథనం ప్రకారం.. అల్గునూర్కు చెందిన చిందం సాయికిరణ్(20), కరీంనగర్ పట్టణంలోని రాంనగర్కు చెందిన దాసరి సాయికృష్ణ(22) వరుసకు బావబామ్మర్దులు. సాయికృష్ణ గురువారం రాత్రి అల్గునూర్లోని సాయికిరణ్ ఇంటికి వచ్చాడు. రాత్రి ఇక్కడే ఉన్నాడు. ఉదయం 6గంటలకు నిద్రలేచిన సాయికిరణ్, సాయికృష్ణ డబ్బులకోసం ద్విచక్రవాహనంపై వరంగల్– కరీంనగర్ రోడ్డు మీదుగా అల్గునూర్ శివారులో దుర్గమ్మ గడ్డవద్ద ఉన్న ఏటీఎం సెంటర్ వద్దకు బయల్దేరారు. కొద్దిదూరం వెళ్లాగానే వరంగల్ నుంచి కరీంనగర్వైపు వస్తున్న లారీ వేగంగా బైక్ను ఢీకొట్టింది. ఇద్దరూ ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికులు ఎల్ఎండీ ఎస్సై నరేశ్రెడ్డికి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
ఓవర్స్పీడే కారణమా..?
అధిక వేగం ఇద్దరు ప్రాణాలను తీసిందని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సాయికిరణ్, సాయికృష్ణ బైక్పై అధిక వేగంగా వెళ్తుండడం, లారీ కూడా వేగంగానే కరీంనగర్వైపు వస్తుండడం, ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఇద్దరూ మృతిచెందారని పేర్కొంటున్నారు. సాయికిరణ్, సాయికృష్ణ హెల్మెట్ ధరించకపోవడంతో తలలకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొంటున్నారు. సంఘటన స్థలానికి భారీగా జనం రావడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలను చూసి చలించనివారు లేరు.
భరోసా పోయింది..
కరీంనగర్లోని రాంనగర్కు చెందిన రవీందర్– రాధ దంపతులకు కూతురు, కొడుకు సాయికృష్ణ(22) సంతానం. రవీందర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొడుకును ఉన్నతంగా చదివించాలని కళలు కన్నాడు. మూడేళ్ల క్రితం రవీందర్ను అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది. దీంతో కుటుం బభారం సాయికృష్ణపైనే పడింది. డిగ్రీ చదివి ఎలక్రీషియన్గా పనిచేస్తూ తల్లి, అక్కను పోషిస్తున్నాడు. ఇటీవలే అక్క పెళ్లి కూడా ఘనంగా జరిపించాడు.గురువారం సాయంత్రం మేనమామ ప్రభాకర్ ఇంటికి వెళ్లిన సాయికృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లాడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్న ఆ తల్లి, అక్కను ఆపడం ఎవరితరం కాలేదు.
ఒక్కగానొక్క కొడుకు
అల్గునూర్కు చెందిన చింద ప్రభాకర్– స్వరూప దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సాయికిరణ్(20). ప్రభాకర్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.పెద్దకూతురుకు వివాహం చేయగా, మరో కూతురు పెళ్లికి ఉంది. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రులు చిన్నతనం నుంచి గారాబంగా పెంచారు. సాయికిరణ్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఎదిగిన కొడుకును లారీ మృత్యువు రూపంలో కబలించడంతో తల్లిదండ్రులు, సాయికిరణ్ అక్కలు గుండెలు పగిలేలా రోదించారు. సాయికరణ్ తల్లి కొడుకుతోపాటు తాను చచ్చిపోతానని లారీకి ఎదురుగా వెళ్లడం అదరినీ కలచివేసింది.
మృత్యువులోనూ.. వీడని బంధం
సాయికృష్ణ, సాయికిరణ్ ఇద్దరూ వరుసకు బావబామ్మర్దులు అయినా సమవయస్కులు కావడంతో చిన్నతంనుంచి స్నేహితుల్లా పెరిగారు. నిత్యం ఇద్దరూ కలుస్తుంటారు. కష్టసుఖాలూ పంచుకుంటుంటారు. గురువారం సాయంత్రం అల్గునూర్కు వచ్చి ఇద్దరూ రాత్రి పొద్దుపోయే వరకూ కబుర్లు చెప్పుకున్నారు. శుక్రవారం ఉదయమే ఇద్దరినీ లారీ మృత్యువు రూపంలో కబళించింది. సమాచారం తెలుసుకున్న సాయికిరణ్, సాయికృష్ణ స్నేహితులు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.