సాక్షి, హైదరాబాద్: అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం కరీంనగర్ రాజీవ్ రహదారిపై జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన యువకులు జగదీష్, శిరీష్గా గుర్తించారు. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా హాకీంపేటలో నమస్తే తెలంగాణ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. తూముకుంటలోని తమ బంధువుల ఇంటికి నుంచి తెల్లవారు జామున తమ పల్సర్ బైక్పై తిరిగి వెళ్తుండగా హాకీంపేట టర్నింగ్ వద్ద జగిత్యాలకు చెందిన పూజిత ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో వారు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమర్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.