ఆస్పత్రిలో కొనఊపిరితోఉన్న బాధితురాలు
తూర్పు గోదావరి ,పిఠాపురం: కన్న కూతురి లాంటి కోడలిని కర్కశంగా హతమార్చాలని ప్లాన్ వేసిన మామ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలనే కనికరం కూడా లేకుండా అతి దారుణంగా ఇనుప రాడ్తో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించిన ఈ సంఘటన కొత్తపల్లి మండలం యండపల్లిలో చోటుచేసుకుంది. అయితే నిందితుడు టీడీపీ నేతకు దగ్గరి బంధువు కావడంతో ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ సంఘటనను బయటకు పొక్కకుండా ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం యండపల్లికి చెందిన గొంతిరెడ్డి సత్యనారాయణ (అన్నవరం) కుమారుడు రామ్మోహన్.. అదే గ్రామానికి చెందిన దివ్యాంగురాలు నాగవరలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే మొదటి నుంచి వరకట్నం ఆశించిన అతడు పెళ్లినాటి నుంచే వేధింపులు ప్రారంభించాడు.
అతనితో పాటు అత్త శేషారత్నం, కుటుంబీకులు కూడా ఆమెను కట్నం కోసం వేధించేవారు. భర్తను ఎంత ప్రాధేయపడినా వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడితో పాటు ఏడుగురిపై వరకట్న కేసు నమోదు చేసి ఫ్యామిలీ కౌన్సెలింగ్కు రమ్మని నోటీసులు జారీ చేశారు. కేసు పెట్టిందన్న కక్షతో మామ సత్యనారాయణ.. యండపల్లిలో భర్త వద్దకు వెళ్లిన వరలక్ష్మిని లాక్కెళ్లి ఇనుప రాడ్తో దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు. తలపై బలమైన గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్న వరలక్ష్మిని చనిపోయిందనుకుని వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పిఠాపురం పట్టణం, కొత్తపల్లి ఇన్చార్జి ఎస్సై శోభన్కుమార్ బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.