టీచర్‌ జాబ్‌ రాదేమోనని యువతి ఆత్మహత్య

27 Feb, 2018 01:54 IST|Sakshi
నిర్మల (ఫైల్‌ ఫొటో)

విషం తాగి బలవన్మరణం

పరిగి : జీవితంలో ఇక టీచర్‌ ఉద్యోగం సాధించలేనేమోనన్న ఆందోళనతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసపేట మండలం వేములకు చెందిన ఎన్‌.చంద్రయ్య చిన్న కుమార్తె నిర్మల(30) డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతోంది. గతంలో 2సార్లు డీఎస్సీ రాసినా కొద్దిలో తప్పిపోయింది. టీఆర్టీ నోటిఫికేషన్‌ రాగానే పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకుంది. వచ్చే నెల 4న ఫిజికల్‌ సైన్స్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ కోసం టీఆర్టీ రాయాలి.

ఈ సారీ పోటీ ఎక్కువగా ఉందంటూ ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనం చదివి తీవ్ర ఆందోళనకు గురైంది. ఇదే సమయంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు వికారాబాద్‌ మిషన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. గతేడాది అనారోగ్య కారణంతో తల్లి మృతిచెందగా అప్పట్నుంచీ నిర్మల మరింత కుంగిపోసాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు