హైదరాబాద్: గోల్కొండ కోటలో గుర్తు తెలియని పర్యాటకుడు శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. రాత్రి 9గంటలకు సెక్యూరిటీ గార్డులు కోటలోని రాణీ మహల్ వెనక లైట్ అండ్ సౌండ్ షో జరిగే ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా అక్కడ ఓ వ్యక్తి పడి ఉండటాన్ని గమనించారు. ముందు నిద్రపోతున్నాడని అనుకున్నా, కదిపి చూసినా లేవకపోవడంతో అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు, 108కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు.
మృతదేహం పక్కన కూల్డ్రింగ్ సీసా, టీ కప్పు ఉండటంతో మృతుడు ఏదైనా విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుని వయసు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండొచ్చని తెలిపారు.