రాజధానిలో ప్రేమజంటపై దాడి

12 Feb, 2019 01:31 IST|Sakshi

ప్రియురాలిపై అత్యాచారం..ప్రతిఘటించడంతో హత్య 

ఇనుపరాడ్డుతో ప్రియుడ్ని బాదిన దుండగులు

ఏపీలో అమానుషం  

మంగళగిరి : గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం నవులూరు గ్రామంలోని అమరావతి స్టేడియంలో సోమవారం రాత్రి ఘోరం చేసుకుంది. తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతి కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాసరావు బీసీ కులానికి చెందిన యువకుడు కాగా.. ఎం.ఫార్మసీ చదువుకున్న జ్యోతి ఎస్టీ యువతి. సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళ్లొస్తానని చెప్పి సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరిన జ్యోతి.. శ్రీనివాసరావుతో కలిసి ఇద్దరూ రాత్రి అమరావతి స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ వారిపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు. శ్రీనివాసరావును రాడ్డుతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు.. యువతిపై లైంగిక దాడికి తెగబడ్డారు.

అనంతరం ఆమెను అమానుషంగా హత్య చేశారు. ఆ సమయంలో బాధితులిద్దరూ కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వారు విని పోలీసులకు సమాచారమిచ్చారు. మంగళగిరి రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసరావును చినకాకాని ఆసుపత్రికి తరలించారు. మంగళగిరి నార్త్‌ జోన్‌ డీఎస్సీ మాట్లాడుతూ.. దుండగులు దాడిచేయడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందిందని, శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు