గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు..16 మంది మృతి

2 May, 2018 09:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాగ్దాద్‌ :  ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఇరాక్‌లోని సలాహుద్దీన్‌ ప్రావిన్స్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాగ్దాద్‌ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుజైల్‌ పట్టణంలోని ఓ గ్రామంలో ఆయుధాలతో వచ్చిన వ్యక్తి మూడు ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరిపాడని స్థానిక లుటెనంట్‌ కల్నల్‌ మహమ్మద్‌ అల్‌ జుబౌరీ తెలిపారు.

కాల్పులు జరిగిన మూడు ఇళ్లు రహిమ్‌ అల్‌ మర్‌జౌక్‌ అనే న్యాయమూర్తి ముగ్గురు కుమారులవిగా గుర్తించారు. చనిపోయిన వారంతా ఈ ముగ్గురు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ ఘటనపై భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. సంఘటనాస్థలాన్ని సీజ్‌ చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు జుబౌరీ తెలిపారు.

మరిన్ని వార్తలు