టీస్టాల్‌ నిర్వాహకుడిపై కత్తితో దాడి

7 Mar, 2019 10:50 IST|Sakshi
గాయాలపాలైన రాములు

మాదాపూర్‌: టీ స్టాల్‌తో పాటు బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అంగోత్‌ రాములు(35) మాదాపూర్‌లోని చందానాయక్‌ తండాలో కుటుంబంతో కలిసి ఉంటూ టీస్టాల్‌ నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి స్వగ్రామానికి వెళ్లింది. రోజు మాదిరిగా రాత్రి టీస్టాల్‌ను మూసివేసి ఉదయం ఇంటి ముందు పడుకొని ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్క్‌లు ధరించి కత్తితో రాములు ఛాతిపై పొడిచి చేతులకు తీవ్రంగా గాయపరిచారు. రాములు అరుపులు విన్న చుట్టుపక్కల వారు రావడంతో దుండగులు పారిపోయారు. 

స్థలమే కారణం..
బాధితుడు రాములు తెలిపిన వివరాల ప్రకారం గతంలో పర్వత్‌నగర్‌లో కోటి రూపాయాల స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. దానికి రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారన్నారు. మిగిలిన డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకుందామనుకుంటే వారు చేయడం లేదని, రకరకాల కారణాలు చెప్పి ఇబ్బంది పెడుతున్నట్టు పోలీసులకు చెప్పాడు. తనపై దాడి చేసింది వాళ్లే అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. అయితే, పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు