వనస్థలిపురంలో భారీ దోపిడీ..

7 May, 2019 12:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని వనస్థలిపురంలో భారీ దోపిడి జరిగింది. ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యాన్ల నుంచి భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా.. సిబ్బంది దృష్టి మరల్చి దాదాపు 58లక్షలను దుండగులు దోచుకెళ్లారు. యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా ఈ చోరి జరిగింది. దీనిపై పోలీసులు మీడియాతో మాట్లాడారు.

ఈ ఘటనపై ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ.. అటెన్షన్‌ డైవెర్షన్‌తో వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిదిలో భారో చోరీ జరిగిందన్నారు. పనామా వద్ద యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బులు జమ చేయడానికి నలుగురు సిబ్బంది వచ్చారని తెలిపారు. వాహనంలో నుంచి డబ్బులు తీసుకెళ్లి జమ చేస్తుండగా.. దుండగులు దృష్టి మళ్లించి డబ్బులు ఉన్న పెట్టెను ఎత్తుకెళ్లారన్నారు. పెట్టెలో దాదాపు 58లక్షలు వరకు ఉండొచ్చన్నారు. చోరీ ఎలా జరిగిందనే విషయంపై విచారిస్తున్నట్లు, ఆ గ్యాంగ్‌లో 5 మంది ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు