ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం
లభ్యం కాని మృతురాలి ఆచూకీ
తూర్పుగోదావరి, రాజోలు: రాజోలు వశిష్టా గోదావరి నదిలో గుర్తు తెలియని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం రాజోలు గోదావరి స్నానాల రేవునకు సమీపంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రాజోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈనెల 17న రాత్రి సమయంలో యువతి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఒడ్డున చెప్పులు, ఎరుపురంగు చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంది. అవి యువతికి చెందిన వస్తువులుగా పోలీసులు గుర్తించారు. యువతి ఎరుపురంగు, బ్రౌన్ కలర్ తెలుపు, ఎరుపు రంగు చుక్కలతో ఉన్న పంజాబ్ డ్రైస్ ధరించి ఉంది. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు. యువతి మృతదేహాన్ని రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు ఆనవాళ్లు తెలుసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు వస్తే గుర్తించేందుకు వీలుగా ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరుస్తామన్నారు.