ఉన్నావ్‌ కేసు: ఏడుగురు పోలీసులపై వేటు

9 Dec, 2019 11:54 IST|Sakshi

లక్నో : ఉన్నావ్‌ అత్యాచారం, హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులపై ఉత్తర ప్రదేశ్‌ సర్కార్‌ వేటు వేసింది. ఈ ఘటనలో నిర్తక్ష్యంగా వ్యవహరించిన ఉన్నావ్‌  పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ త్రిపాఠితోపాటు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ విక్రాంత్ వీర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిని నిందితులు అడ్డుకుని దాడిచేసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన బాధితురాలు శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మృతురాలి కుటుంబం డిమాండ్‌ మేరకు బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు లక్నో డివిజనల్ కమిషనర్ ముఖేష్ మెష్రం ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.

చదవండి : ఉన్నావ్’ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి

మరిన్ని వార్తలు