పిల్లల జోలికెళ్తే మరణ శిక్షే!

7 Jan, 2018 10:09 IST|Sakshi

నైనిటాల్‌ : చిన్నారులపై దాష్టీకాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. ఈ మేరకు గట్టి చట్టాలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు కేంద్రానికి పలుమార్లు సూచించింది. కానీ,  శిక్షా స్మృతిలోని లోపాటు.. మానవ హక్కుల సంఘం అభ్యంతరాలతో అది కార్య రూపం దాల్చలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ హైకోర్టు బెంచ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

చిన్నారులపై మృగవాంఛ తీర్చుకునే వారికి మరణ శిక్ష తప్ప మరొక ప్రస్తావన ఉండకూడదని అభిప్రాయపడింది. ‘‘పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిపోతున్నాయ్‌. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడితే వారికి మరణ శిక్షే సరి. అందుకోసం అవసరమైన చట్టాలు చెయ్యండి అని జస్టిస్‌ రాజీవ్‌ శర్మ, అలోక్‌ సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి సూచించింది.  

2016లో ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆ కేసులో దిగువ న్యాయస్థానం అతనికి మరణ శిక్ష విధించింది. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. శుక్రవారం దీనిపై హైకోర్టు బెంచ్‌ విచారణ చేపట్టగా.. పై వ్యాఖ్యలు చేసింది. కాగా, జాతీయ నేర పరిశోధన రికార్డులను ప్రస్తావించిన బెంచ్‌.. భారత్‌లో ఇలాంటి నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయని చెప్పింది. 2014లో 489, 2015లో 635, 2016లో 676 కేసులు నమోదు అయ్యాయని పేర్కొంటూ ఈ అంశ తీవ్రతను తెలియజేసింది. 

మరిన్ని వార్తలు