దేశ రాజధానిలో విదేశీ మహిళపై ఘాతుకం

13 Aug, 2019 08:37 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో విదేశీ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఉజ్బెకిస్ధాన్‌కు చెందిన 31 సంవత్సరాల మహిళ తనపై ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో కదులుతున్న కారులో ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేయగా, గురుగ్రామ్‌కు చెందిన ఓ నిందితుడు ఆమెకు పరిచయస్తుడేనని చెప్పారు. రెండు నెలల కిందట భారత్‌కు వచ్చిన మహిళ మదన్‌గిరిలో స్నేహితులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో స్నేహితుడిగా నమ్మబలుకుతూ నిందితుడు ఆమెకు చేరువయ్యాడు.

వసంత్‌కుంజ్‌ ప్రాంతంలోని ఓ మాల్‌ వద్ద శనివారం తనను కలుసుకోవాలని నిందితుడు ఫోన్‌ చేశాడని బాధితురాలు అక్కడకు రాగానే తన కారులో ఆమెను ఎక్కించుకుని గురుగ్రామ్‌ తీసుకెళ్లాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. కారులో అప్పటికే మరో ఇద్దరు నిందితులు కూర్చున్నారని, ముగ్గురూ ఆమెను లైంగికంగా వేధించడంతో ప్రతిఘటించిన క్రమంలో ఆమెను తీవ్రంగా కొట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. అనంతరం తనను తన ఫ్లాట్‌ సమీపంలో విడిచిపెట్టి పరారయ్యారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఫ్లాట్‌కు చేరుకున్న అనంతరం జరిగిన విషయాన్ని స్నేహితులతో చెప్పగా వారు బాధిత మహిళను ఎయిమ్స్‌కు తరలించగా, ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు