లొంగిపోయిన వనితారెడ్డి!

27 Dec, 2017 14:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ కమెడియన్‌ విజయ్‌సాయి భార్య వనితారెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. న్యాయవాదితో కలిసి వచ్చిన ఆమెను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించిన విజయ్‌ ఈ వీడియోలో భార్య వనితపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన చావుకు వనిత, మరో ఇద్దరు కారణమని, వారిని వదిలిపెట్టదని ఈ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో వనితపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజులుగా పరారీలో ఉన్న వనిత.. తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు.

అందుకే అజ్ఞాతంలో ఉన్నా..: వనితారెడ్డి
విజయ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆధారాలు పోలీసులకు సమర్పించబోతున్నట్టు అంతకుముందు ఆమె మీడియాకు తెలిపింది. పోలీసులు సరెండర్‌ కావాలని నోటీసులు ఇచ్చారని, అందుకే తాను పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపింది. ఆమె మీడియాతో ఏమన్నారంటే.. 'విజయ్‌ను నేను వేధించలేదు. అతని సెల్ఫీలో వాస్తవాలు చెప్పలేదు. విజయ్‌ నా పేరు ఎందుకు చెప్పాడో తెలియదు. తల్లిదండ్రలు వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్ష్యాల కోసమే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నా. పోలీసులకు అన్ని సాక్ష్యాధారాలు సమర్పిస్తా' అని వనితారెడ్డి తెలిపారు.

విజయ్‌ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను వనితరెడ్డి గతంలో మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని ఆమె గతంలో వెల్లడించారు. విజయ్‌ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. 'విజయ్‌ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మూడేళ్లుగా విజయ్‌కి దూరంగా ఉంటున్నాను. అలాంటిది నేను ఆయన ఆత్మహత్యకు కారణం అంటే ఎలా కుదురుతుంది. అందరూ అనుకుంటున్నట్లు నేను ఎక్కడికీ పారిపోలేదు. త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోతాను. విజయ్‌ తల్లిదండ్రులు నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు. విజయ్‌ చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాల్లో వారు ఉన్నారు' అని ఆమె గతంలో అన్నారు.

లొంగిపోయిన వనితారెడ్డి!

మరిన్ని వార్తలు