అతనో ముసుగులోని క్రూరమృగం: బాధితురాలు

3 Jan, 2018 13:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచానికి అతనొక ప్రముఖ గజల్‌ గాయకుడు. శాంతికాముకుడు. ఆధ్మాత్మికవేత్త. కానీ అతని అసలు స్వరూపం అది కాదని, మహిళల పట్ల అతనో ముసుగు వేసుకున్న క్రూరమృగమని అంటున్నారు బాధితురాలు. గజల్‌ శ్రీనివాస్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదుచేసిన ఆమె తాజాగా ’సాక్షి’ టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. గజల్‌ శ్రీనివాస్‌ బాగోతాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఆ యువతి.. అతను, అతని పనిమనిషి పార్వతి చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు.

ఆమె స్వచ్ఛందంగా తనకు మసాజ్‌ చేసేందుకు ఒప్పుకున్నదని గజల్‌ శ్రీనివాస్‌, అతని పనిమనిషి పార్వతి ఆరోపిస్తుండగా..  ఆ ఆరోపణలను అవాస్తవమని, అసలు వాస్తవం అందరికీ తెలియాలనే తాను వీడియోలు బహిర్గతం చేశానని, ఆ సమయంలో తనను ఆమె ఏ విధంగా శ్రీనివాస్‌ గదిలోకి తీసుకెళ్లింది వీడియోలో నమోదైందని బాధితురాలు వివరించారు. వాళ్లు చెప్పింది అబద్ధం అని నిరూపించడానికి ‘సేవ్‌ టెంపుల్‌’ వీడియో కూడా ఇచ్చానని ఆమె అన్నారు. ఆమెను తాను సొంత కూతురిలాగా చూసుకున్నానని, ఆమె పట్ల ఎలాంటి తప్పుడు చర్యకు పాల్పడలేదని, ఉద్దేశపూర్వకంగానే ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని గజల్‌ శ్రీనివాస్‌ మీడియాతో పేర్కొన్న వ్యాఖ్యలు ప్రస్తావించగా.. ’అవన్నీ అబద్ధాలు.. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా మీడియాకు అందించాను. వాటిని చూస్తే అందరికీ అర్థం అవుతుంది.. మహిళల పట్ల అతను ముసుగు వేసుకున్న ఒక క్రూరమృగం అన్నది నిర్ధారణ అవుతుంది’ అని బాధితురాలు తెలిపారు.

మరిన్ని వార్తలు