టూరిస్ట్‌ వీసాతో ఏజెంట్‌ మోసం

6 Jan, 2018 11:30 IST|Sakshi
షార్జా నుంచి సోషల్‌ మీడియాలో మాట్లాడుతున్న బాధితుడు పృ«ధ్వీ

పశ్చిమగోదావరి, తణుకు : ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టూరిస్ట్‌ వీసాపై షార్జాకు పంపిన ఏజెంట్‌ తనను మోసం చేశాడంటూ ఒక బాధితుడు వాపోయాడు. కుంచనపల్లి గ్రామానికి చెందిన పృథ్వి అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో అక్కడి నుంచి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తణుకు పట్టణానికి చెందిన రాయల్‌ ట్రావెల్స్‌ యజమాని నర్సింహరాజు ద్వారా తాను షార్జా వచ్చి మోసపోయానని చెబుతున్నారు. ఈ మేరకు సంబంధిత వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన వద్ద రూ.80 వేలు తీసుకుని ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగం ఉందని గతేడాది నవంబర్‌ 15న షార్జా వచ్చానని చెప్పాడు.

షార్జాలో ఖాన్‌ అనే ఏజెంట్‌ తనను హెల్పర్‌గా పనిచేయాలని చెప్పాడన్నారు. అన్ని పనులు చేయాలని చెప్పడంతో పాటు తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు. టూరిస్ట్‌ వీసా గడువు తీరిపోవడంతో డబ్బులు కట్టమంటున్నారని చెబుతున్నాడు. దీనిపై స్పందించిన తణుకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కేఏ స్వామి రాయల్‌ ట్రావెల్స్‌ యజమాని నర్సింహరాజును స్టేషన్‌కు పిలిపించి విచారించినట్టు చెప్పారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు సీఐ వివరించారు.

మరిన్ని వార్తలు