రేషన్‌ డిపోల్లో విజిలెన్స్‌ తనిఖీలు

6 May, 2018 10:49 IST|Sakshi
పాంచాలి డిపోలో తనిఖీలు చేస్తున్న అధికారులు

సాలూరురూరల్‌ (పాచిపెంట): పాచిపెంట మండలంలోని గురువునాయుడుపేట, పాంచాలి గ్రామాల్లోని రేషన్‌డిపోల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. గరువునాయుడుపేట డిపోలో మూడు క్వింటాళ్ల 88 కిలోల బియ్యం, 11 కిలోల పంచదార తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్‌ గొట్టాపు వెంకటస్వామినాయుడుపై కేసు నమోదు చేశారు. అలాగే పాంచాలి డిపో–1లో 30 కిలోల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. చిన్న తప్పు దొర్లినా చర్యలు తప్పవని డీలర్‌ పెద్దిబాబును హెచ్చరించారు.

అలాగే పాంచాలి –2 డిపోలో తనిఖీలు చేపట్టగా 5 క్వింటాళ్ల 16 కిలోల బియ్యం, 40 కిలోల పంచదార అధికంగా ఉన్నట్లు గుర్తించి డీలర్‌ గొర్లె అప్పన్నబాబుపై కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ కృష్ణ మాట్లాడుతూ,  రేషన్‌డిపోల్లో 100 కిలోల వరకు బియ్యం అదనపు నిల్వలు ఉంచవచ్చన్నారు. డిపోలు పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట హెచ్‌సీ ధర్మారావు, సీఎస్‌డీటీ రామకృష్ణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు