హరిత హోటల్‌పై విజిలెన్స్‌ దాడులు

25 Mar, 2018 09:28 IST|Sakshi
హోటల్‌లో లభించిన ఖాళీ మద్యం సీసాలు

కనిపించని క్యాష్‌ బుక్‌

పేకముక్కలు, ఖాళీ మద్యం సీసాలు లభ్యం

ధర్మపురి :  రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల్లో ఏర్పాటు చేసిన హరిత హోటళ్లు అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ధర్మపురి క్షేత్రంలోని హరిత హోటల్‌పై శనివారం విజిలెన్స్‌ అధికారులు దాడిచేయగా పలు విషయాలు వెలుగుచూశారు. స్థానికులు, అధికారుల కథనం ప్రకారం.. ధర్మపురిలోని గోదావరి ఒడ్డున వీఐపీల విడిది  కోసం హరిత హోటల్‌ ఏర్పా టు చేశారు. ఇందులో మధ్యం, మాం సం ఉండదు. నిత్యం ధర్మపురికి వచ్చే భక్తులకు ఈ భవనం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొంత కాలంగా హోటల్‌లో మేనేజర్‌ ఇష్టానుసారంగా మెనూ తయారు చేయిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి.

దీంతో హైదరాబాద్‌ నుంచి వచ్చిన విజిలెన్స్‌ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో హోటల్‌పై దాడిచేశారు. స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో గదుల్లో కనీస శుభ్రత కూడా కనిపించలేదు. గదుల్లో పేక ముక్కలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌కు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. క్యాష్‌బుక్‌ కనిపించకపోవడంతో హోటర్‌  మేనేజర్‌ బాలకృష్ణను పోలీసులు విజిలెన్స్‌ అధికారులు ప్ర«శ్నించగా నీళ్లు నమిలాడు. క్యాష్‌బుక్‌ పోయిందని బుకాయించాడు. ప్రతిరోజూ హోటల్‌లో ఎంత మంది ఉంటున్నారు, ఎన్ని గదులు అద్దెకిస్తున్నారు.. జమ, ఖర్చుల వివరాలేవని ప్రశ్నించారు. మేనేజర్, సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు. కాగా, విజిలెన్స్‌ దాడుల అనంతరం మేనేజర్‌ బాలకృష్ణ హోటల్‌ క్యాష్‌బుక్‌ పోయిందని ధర్మపులి ఠాణాలో సాయంత్రం ఫిర్యాదు చేశారు. హోటల్‌లో అసాంఘిక కార్యకలాపాలు, క్యాష్‌బుక్‌ మాయంపై విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.   

మరిన్ని వార్తలు