ఆ బైక్‌ రేసర్లు ఎవరో తేలింది

15 Jun, 2018 16:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలో అర్థరాత్రి బైక్‌ రేసులు నిర్వహించిన యువకులను నగర పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా అర్థరాత్రి కనక దుర్గమ్మ వారధి, కృష్ణలంక నేషనల్ హైవేలపై ఈ బైక్ రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. రేసింగ్‌ల వల్ల తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నామని స్థానికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం రేసింగ్‌లపై దృష్టి సారించింది. ఇందుకు సంబందించిన సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు సదరు యువకుల వివరాలను కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టారు. 

రేసింగ్‌లో పాల్గొన్న యువకులంతా హైదరాబాద్‌కు చెందిన ‘రోడ్‌ ర్యాప్జ్‌’  గ్రూప్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రతి మూడు నెలలకొకసారి బెజవాడ సమీపంలోని అడ్వెంచర్‌ క్లబ్‌లో స్పోర్ట్స్‌ బైక్‌కు సంబంధించి ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ గ్రూప్‌ యువకులతో రేసింగ్‌లు జరుపుతున్నట్టు సమాచారం. అ క్రమంలోనే ఇటీవల బైక్‌ ప్రమోషన్స్‌లో పాల్గొన్న యువకులు తిరిగి హైదరాబాద్‌ వెళ్తూ మితిమీరిన వేగంతో బైక్స్ నడపటం, ప్రమాదకర విన్యాసాలు చేసినట్టు పోలీసులు తెలిపారు. క్లబ్‌లో ఓ రైస్‌ ట్రాక్‌ను పోలీసులు గుర్తించారు. అయితే అడ్వెంచర్‌ క్లబ్‌లో రేసింగ్‌లకు అనుమతులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. యువకుల మీద కేసులు పెట్టె యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు