మహిళల ఫొటోలు తీస్తున్న వ్యక్తికి దేహశుద్ధి

14 Jul, 2018 13:27 IST|Sakshi

తడ: మహిళలు స్నానం చేస్తున్న, బహిర్భూమికి వెళుతున్న సమయంలో సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని శుక్రవారం గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. అమావాస్య సందర్భంగా వేనాడు గ్రామంలోని షేక్‌ దావూద్‌ షావలీ అల్లా దర్గాను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గురువారం వేనాడుకు చేరుకున్నారు. బాబా దర్శనానంతరం మొక్కులో భాగంగా రాత్రి అక్కడే నిద్రించారు.

శుక్రవారం ఉదయం చెట్లు, దడుల మాటున బట్టలు మార్చుకుంటున్న, స్నానాలు చేస్తున్న, బహిర్భూమికి వెళ్లిన మహిళలను ఓ యువకుడు సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తుండడంతో మహిళలు గమనించి కుటుంబసభ్యులకు తెలిపారు. వారు స్థానికుల సాయంలో ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం తడ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని అతనిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఇతను గతంలోనూ ఇదే పనిచేస్తూ ఉండగా బాధితులు పట్టుకునే క్రమంలో చేతిలో బ్లేడు వంటి ఆయుధం చూపి పారి పోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇతనికి సంబంధించి రాత్రి వరకు ఎవరూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యలేదు.   

మరిన్ని వార్తలు