వైరల్‌ ఫొటో.. వాళ్ల ఫేట్‌ రివర్సైంది!

7 May, 2018 14:49 IST|Sakshi
వనీ నేతృత్వంలోని హిజ్బుల్‌ ఉగ్రవాదుల ఫొటో సర్కిల్‌లో సద్దాం పద్దేర్, ఇన్‌సెట్‌లో ప్రొఫెసర్‌ రఫీ భట్‌

జమ్ము: వేర్పాటువాదం తలకెక్కించుకున్న ఆ యువకులు తుపాకులు చేతబట్టి దిగిన ఆ ఫొటో.. వాళ్ల తలరాతను మార్చేసింది. జమ్ముకశ్మీర్‌లోని షోఫియాన్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్‌ వనీ గ్యాంగ్‌ చివరి సభ్యుడు సద్దాం పద్దేర్ కూడా హతమయ్యాడు. రెండేళ్ల కిందటి ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం.. ఆ ఫొటోలో ఉన్న 10 మందిని వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. అరెస్టైన ఒక్కడు మాత్రం జైలులో ఉన్నాడు. 

ఆదివారం నాటి ఎన్‌కౌంటర్‌లో వనీ అనుచరుడైన పద్దేర్‌ సహా హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ లోయలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న కాల్పుల్లో మరో ఐదుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లోయలో వరుస ఘటనలపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. తుపాకులు, రాళ్లను చేతబడుతున్నది పేదలేనని, అలాంటి యువకుల ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదో ఒక మధ్యంతర విధానం అవసరం ఉన్నదని ఆమె అన్నారు.

ఒక్కరోజు ఉగ్రవాది: షోఫియాన్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రఫీభట్‌.. కశ్మీర్‌ విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగంలో సహాయ అధ్యాపకుడిగా పనిచేసేవాడు. శుక్రవారమే హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరిన అతను.. ఆదివారానికి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయమే భట్‌ తన తండ్రికి ఫోన్‌ చేసి, ‘మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను అల్లా వద్దకు వెళ్తున్నందున ఇదే నా చివరి ఫోన్‌ కాల్‌’ అని చెప్పాడు. 
(చదవండి: ఐదుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌)

మరిన్ని వార్తలు